KTR Bandi Sanjayమాటకు మాట… దెబ్బకు దెబ్బ అని చాలాసార్లు విని ఉంటాము. ఇప్పుడు దానికి ట్వీటుకి ట్వీటు అని చెప్పుకోవచ్చు. కేసీఆర్‌ నా బంగారు తెలంగాణ పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ అడుగు జాడలలో నడుస్తున్న మంత్రులు కూడా ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆదానీతో దోస్తీ కోసం మోడీ దేశాన్ని దోచిపెడుతున్నారంటూ ప్రస్తుతం పార్లమెంటులో రభస జరుగుతోంది. ఇదే సమయంలో ఉగాది పంచాంగం చెప్పుకొనే అవకాశం వచ్చింది కనుక పంచాంగ భాషలోనే తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. దానికి అదే భాషలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఘాటుగా సమాధానం ఇచ్చేశారు.

ఇంతకీ మంత్రి కేటీఆర్‌ ఏం ట్వీట్‌పై పంచాంగం చెప్పారంటే, “ఆదాయం: అదానీకి! వ్యయం: జనానికి, బ్యాంకులకు! అవమానం: నెహ్రూకి! రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!! బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!” అని వేయగా దానికి బండి సంజయ్‌ ఏమని సమాధానం ఇచ్చారంటే, “ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !! తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి…పతనం ఇగ షురువాయే,” అని బదులిచ్చారు.

ఆదానీ విషయంలో ప్రధాని నరేంద్రమోడీని అందరూ ఏవిదంగా వేలెత్తి చూపుతున్నారో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం ప్రాజెక్టుల పేరుతో భారీగా అవినీతికి పాల్పడి భారీగా ఆస్తులు పోగేసుకొందని ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. అమరవీరులను పక్కన పడేసి ఉద్యమ ద్రోహులను కేసీఆర్‌ చంకనెక్కించుకొన్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే… బండి సంజయ్‌ ఈవిదంగా చెప్పారు.