క్రియేటివ్ డైరెక్టర్ గా కెరీర్ తొలినాళ్లలో కృష్ణవంశీ వరుస విజయాలను అందుకున్నాడు. ఆ తరువాత ఆయనను సక్సెస్ పలకరించి చాలాకాలమే అయింది. ఆ మధ్య చేసిన ‘నక్షత్రం’ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. అప్పటి నుంచి కూడా తదుపరి ప్రాజెక్టును గురించి ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఆయన నుంచి ఒక భారీ హారర్ థ్రిల్లర్ రానుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.
‘నక్షత్రం’ సినిమాకి ముందే కృష్ణవంశీ ఒక హారర్ థ్రిల్లర్ చేయాలనుకున్నాడు. ఆ సినిమాకి ‘రుద్రాక్ష’ అనే పేరు పెడుతున్నట్టుగా కూడా చెప్పాడు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ కథను పట్టాలెక్కించే పనిలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కథకు దాదాపు 40 కోట్లు ఖర్చు కావొచ్చని, దాంతో గట్టి నిర్మాత కోసం కృష్ణవంశీ ప్రయత్నిస్తున్నాడని ట్రేడ్ టాక్.