కృష్ణా పుష్కరాల తొలి రోజున మధ్యాహ్నం వరకూ విజయవాడలోని వివిధ ఘాట్లలో దాదాపుగా 2 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారని పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. తొలి రోజు మొత్తమ్మీద భక్తుల సంఖ్య 3 లక్షలను దాటకపోవచ్చని అంచనా వేస్తున్నట్టు వివరించారు. అయితే వారాంతం మాత్రం భారీగా ప్రజలు వస్తారని భావిస్తున్నామని, రెండవ రోజు సుమారు 25 లక్షల మంది వస్తారన్న అంచనాతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
అలాగే వరుసగా మూడు రోజుల పాటు శనివారం, ఆదివారం, సోమవారం సెలవు దినాలు కావడంతో, ఈ మూడు రోజుల్లో దాదాపు కోటి మందికి పైగా భక్తులు విజయవాడ పరిసరాల్లోని ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తారనే అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎంతమంది భక్తులు విచ్చేసినా, ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు తెలిపారు.
గోదావరి పుష్కరాలకు వచ్చిన జనం రీత్యా తొలి రోజు భారీ జనం వస్తారని భావించినప్పటికీ, శ్రావణ శుక్రవారం రీత్యా జనసాంద్రత అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ సంఖ్యలోనే వచ్చారు. అదీ గాక, కృష్ణానదీ ప్రకాశం బ్యారేజ్ నుండి దాదాపు 100 కిలోమీటర్లు దిగువకు ఉండడంతో, ఘాట్లు లేకపోయినా, నదీ పరివాహంలో భక్తులు విరివిగా స్నానమాచరిస్తున్నారు. మొత్తమ్మీద ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా పుష్కరాలు మొదటి రోజు ముగిసిపోయింది.