Krishna Kumari passed away due to blood cancerబెంగళూరులో ఈ ఉదయం మరణించిన అలనాటి నటి కృష్ణకుమారి, తన చివరి రోజులను ఒంటరిగా గడిపినట్టు తెలుస్తోంది. తన భర్త అజయ్ మోహన్ నగర శివార్లలో ఎంతో ఇష్టపడి కట్టించి ఇచ్చిన ఫామ్ హౌస్ ను వదిలి వెళ్లలేక, అక్కడే ఉండిపోయారు. తన భర్త ప్రేమగా కట్టించి ఇచ్చిన ఆ భవంతిని వదలడం తనకు ఇష్టంలేదని తన చివరి ఇంటర్వ్యూల్లో ఆమె వ్యాఖ్యానించారు.

కుమార్తె దీపిక తనతోనే ఉండాలని ఒత్తిడి తెచ్చినా కృష్ణకుమారి అంగీకరించలేదు. ఫామ్ హౌస్ లోని పచ్చదనం తనకెంతో నచ్చుతుందని చెప్పే ఆమె, అక్కడే జీవనం గడుపుతూ, తన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న ఆమె, వయసు పైబడిన కారణంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారట.

అంత్యక్రియలు నేటి సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని ఆమె సోదరి మరో సీనియర్ నటి షావుకారు జానకి స్పష్టం చేశారు. ముందుగా గురువారం నాడు అంత్యక్రియలు జరపాలని తొలుత భావించామని, అయితే రేపు కర్ణాటకలో బంద్ జరగనున్న కారణంతో నేడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం పార్థివదేహాన్ని రేపటి వరకూ ఉంచాలని భావించినా, వీలు కాకపోయిందని అన్నారు.