chandrababu-naidu-apసామాజిక, ఆర్థిక, సాధారణ తదితర విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని జిల్లాలకు ప్రభుత్వం రేటింగ్‌లు ఇచ్చింది. ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో ఈ రేటింగ్స్‌ ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్స్‌ లో కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ‘ఎ’ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు, కడప జిల్లాలు ‘బి’, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ‘సి’ రేటింగ్ దక్కింది.

నిజానికి ‘ఎ’ రేటింగ్ దక్కించుకున్న కృష్ణాజిల్లా సాధారణ సూచీలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ విభాగంలో ‘సి’ రేటింగ్‌తో సరిపెట్టుకున్నా, సామాజిక, ఆర్థిక సూచీల్లో ముందంజలో ఉండడంతో ‘ఎ’ రేటింగ్‌తో అగ్రస్థానం దక్కించుకోగలిగింది. సామాజిక, ఆర్థిక, సాధారణ సూచీల్లో పశ్చిమగోదావరి జిల్లా ‘ఏ’ రేటింగ్‌లో నిలిచినప్పటికీ మొత్తంగా కృష్ణాజిల్లా కంటే వెనకబడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇక సామాజిక సూచీలో వెనకబడిన ప్రకాశం జిల్లా ‘బి’ రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఆర్థిక సూచీలో నెల్లూరు జిల్లా ‘ఎ’ రేటింగ్ సాధించినప్పటికీ మిగిలిన సూచీల్లో ద్వితీయ స్థానానికి పరిమితం కావడంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రేటింగ్స్ తో ఆయా జిల్లాలు ఏయే విభాగాలలో రాణిస్తున్నాయో అధికారులకు తేలికగా అవగతమవుతోంది.