‘జనతా గ్యారేజ్’ కమర్షియల్ గా వసూలు చేస్తున్న కలెక్షన్స్ కు, తొలి రోజు సినీ విశ్లేషకులు ఇచ్చిన రివ్యూలకు ఎక్కడా పొంతన లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జనతా గ్యారేజ్’కు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి గానీ, సినీ విమర్శకుల నుండి సర్వత్రా ఒకే ఒక అభిప్రాయం వెలువడింది. ఏ విశ్లేషణ చూసినా… హైలైట్స్, మైనస్ పాయింట్స్ లలో ఒకే రకమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగానే ఈ విశ్లేషణలు చిత్ర యూనిట్ ను బాధపెట్టి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.
మరి అలాంటి ‘రివ్యూ’లపై దర్శకుడు కొరటాల శివ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? అంటే దానికి సమాధానం లభించింది. ఓ మీడియా ఛానల్ లో పాల్గొన్న వేదికపై నుండి స్పందించిన కొరటాల… “రివ్యూలను వారి వారి జాబ్ లుగా పరిగణించిన కొరటాల, అవి వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పారు. నా ముందు సినిమాలను బట్టి ‘జనతా గ్యారేజ్’ అనగానే వాళ్ళు ఒక కధ రాసుకుని ఉండవచ్చు, ఆ సమయంలో, ఆ క్షణంలో వారికి అనిపించింది రివ్యూల రూపంలో ఇస్తున్నారేమో… అయితే వారిని నిందించలేం” అంటూ ఓ పక్కన సమర్ధించే వ్యాఖ్యలు చేసారు.
అయితే ఇదే సమయంలో పబ్లిక్ ఫ్లాట్ ఫాంస్ మీద ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచేటపుడు… ‘కొన్ని కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు, ఆరేడు నెలల పాటు శ్రమ’ కూడా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఇది తన విజ్ఞప్తి మాత్రమేనని అన్నారు. ఇలా రాసేటపుడు వారి వ్యక్తిగత అభిప్రాయాలే కాకుండా, ఓ పది మందిని అడగడమో, ఇంకాస్త సర్వే చేయడమో జరిగితే బాగుంటుందని, ప్రేక్షకుల మైండ్ ను ప్రభావితం చేయకుండా ఉంటే చాలన్న ఫీలింగ్ తనదని, అయితే ఏది ఏమైనా… చివరికి అది వారి జాబ్ అదని… కాస్త పరిపక్వత గల జవాబు ఇచ్చుకున్నారు కొరటాల.