ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితం అయిన సుకుమార్ – ప్రిన్స్ మహేష్ బాబుల “1 నేనొక్కడినే” సినిమా అభిమానుల జాబితాలో దర్శకుడు కొరటాల శివ కూడా ఉండడం విశేషం. ఇటీవల ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఈ విషయాన్ని బయటపెట్టారు. తన దృష్టిలో “వన్” చాలా మంచి సినిమా, కానీ ఆడలేదు, దీని ద్వారా ప్రేక్షకుల అభిరుచిని కొంత నేర్చుకున్నానని చెప్పాడు కొరటాల. మన అభిరుచులను ప్రేక్షకులపై రుద్దకూడదని, సందేశాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానని, తన అసిస్టెంట్ లకు కూడా తానూ ఎపుడూ మెస్సేజ్ లను ఇవ్వనని చెప్పాడు కొరటాల.
‘మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ వంటి హ్యాట్రిక్ సక్సెస్ లో ఉన్న కొరటాల వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో విలువ పెరిగింది. తన తదుపరి సినిమా కధను ఇప్పటికే మహేష్ బాబుకు చెప్పానని, ఇద్దరికీ బాగా నచ్చిందని, మళ్ళీ సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నానని, ఒక ఎమోషనల్ కధగా తెరకెక్కనుందని తెలిపారు. తన టార్గెట్ 10 బ్లాక్ బస్టర్ విజయాలను అందివ్వడమని, మూడు వరకు ఎక్కడా తప్పటడుగులు పడలేదని అన్న కొరటాల, తన చేతిలో ఇంకా 7 కధలు ఉన్నాయని, అందరి హీరోలతో సినిమాలు తీయాలన్నది తన ఆకాంక్షగా చెప్పుకొచ్చారు.
రచయితగా పని చేసిన రోజుల్లో చాలా సినిమాలకు తన పేరు వేయలేదని, అందులో ‘సింహా’ సినిమా కూడా ఉందని, కధ, మాటలు తనవి అయితే, దానికి బదులు మరో స్థానంలో తన పేరు వేస్తానని చెప్పడం, తానూ కోపంతో అది కూడా వద్దని చెప్తే, వాళ్ళు చింతించాల్సింది పోయి, హమ్మయ్య అనుకుని, మొత్తానికే అది కూడా తీసేసేవారని తన గత అనుభవాలను కూడా పంచుకున్నారు. అంతగా రగిలిపోయాడు కాబట్టే… వరుస బ్లాక్ బస్టర్లను తీస్తూ… టాలీవుడ్ టాప్ దర్శకుడిగా మారాడు కొరటాల.