Kollywood producer Ashok Kumar Suicide తమిళనాడులో సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్న కుందువడ్డీ మాఫియా… తమిళ సినీ రంగాన్ని కూడా చాప కింద నీరులా కబళించింది. తమిళ నిర్మాత అశోక్ కుమార్ ఫైనాన్షియర్ల అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత… ఈ వడ్డీ మాఫియా లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అశోక్ ఆత్మహత్యకు ఫైనాన్షియర్ అన్బు చెళియనే కారణమని పోలీసులకు ఫిర్యాదు అందడంతో… అన్బు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు.

ఇతని కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అన్బు ఊబిలో చిక్కుకుని తమిళ సినీ నిర్మాతలు విలవిల్లాడిపోయారట. ఈయన దెబ్బకు నిర్మాతలే కాకుండా తమిళ అగ్ర హీరో అజిత్, నటి దేవయాని సహా పలువురు ప్రముఖులు ఎన్నో ఇబ్బందులు పడ్డారట. అన్బు టార్చర్ తట్టుకోలేక 2003 మే 3న నిర్మాత జి.వెంకటేశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఆ ఘటన పెను సంచలనం సృష్టించింది. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం దృష్టికి ఆ విషయాన్ని నిర్మాతలు తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అన్నాడీఎంకేతో అన్బుకు ఉన్న సంబంధాలే దీనికి కారణం.

ఇక అజిత్ విషయానికి వస్తే, చాలా ఏళ్ల క్రితం ‘నాన్ కడవుల్’ చిత్రంలో అజిత్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి అజిత్ తప్పుకున్నాడు. ఒప్పందం ప్రకారం తీసుకున్న అడ్వాన్సును వడ్డీ సహా చెల్లించేందుకు అజిత్ సమ్మతించాడు. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన అన్బు చెళియన్… మీటరు వడ్డీ ఇవ్వాలంటూ అడ్డుతగిలాడు. అంతేకాదు, అజిత్ ను గదిలో కూడా నిర్బంధించాడు.

ఈ ఘటనతో కోలీవుడ్ షాక్ కు గురైంది. ఆ తర్వాత కొందరు సినీ ప్రముఖులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. నటి దేవయాని విషయానికి వస్తే, అన్బు దగ్గర ఆమె రుణం తీసుకుంది. ఆ తర్వాత వడ్డీలు కట్టలేక ఆమె సతమతమయింది. ఈ నేపథ్యంలో, అప్పు తీర్చడం కోసం ఇష్టం లేకపోయినా ఆమె టీవీ సీరియల్స్ లో నటించాల్సి వచ్చింది.