టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఉదయం క్రితం కన్నుమూశారు. గుండెపోటు వల్ల అని కొందరు, ఆత్మహత్య అని మరికొందరు చెబుతున్నారు. దీనితో ఆయన మృతికి కారణం ఏమయ్యుంటుంది అని అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఉదంతం కోడెల హైదరాబాద్ నివాసంలో జరగడంతో తెలంగాణ పోలీసులు కోడెల మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఉరివేసుకుని మరణించినట్టు కుటుంబసభ్యులు తమకు తెలిపారని తెలంగాణ హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో తెలిపారు.
కొత్త ప్రభుత్వం పెట్టిన కేసుల వాళ్ళ ఆయన విపరీతమైన ఒత్తిడిలో ఉన్న విషయం తెలిసిందే. కోడెల శివ ప్రసాదరావు మృతదేహానికి ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్తోపాటు ఐదుగురు డాక్టర్ల బృందంతో శవ పరీక్ష నిర్వహించింది. శవపరీక్షను బట్టి మృతికి సరైన కారణాలు వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, పార్టీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, కాంగ్రెస్ నేత జానారెడ్డిలు ఉస్మానియా మార్చురీకి చేరుకున్నారు.
మరోవైపు కోడెల మరణ వార్త తెలియగానే పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కోడెల సంతాప సభలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కార్యాలయాలపై తెదేపా జెండాలను అవనతం చేయాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని అధికారపార్టీ కూడా కోడెల మృతిపై అనుమానాలు వ్యక్తం చెయ్యడం కొసమెరుపు.