kodali nani perni nani safe in cabinet expansionత్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుదని, దానిలో చాలామందిని బయటకు పంపిస్తానని సిఎం జగన్ నిన్ననే స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు మానసికంగా ఇందుకు సిద్దమై ఉన్నారు కూడా. అయితే వారిలో ఇద్దరు మాత్రం సేఫ్ అని తెలుస్తోంది. వారిలో ఒకరు చంద్రబాబునాయుడు సామాజికవర్గానికి చెందినవారుకాగా మరొకరు పవన్‌ కల్యాణ్‌ సామాజికవర్గానికి చెందినవారు. వారే మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.

మంత్రివర్గ కూర్పు లేదా విస్తరణలో ఎమ్మెల్యేల కులమతాల లెక్కలు పరిగణనలోకి తీసుకోవడం పరిపాటే. అయితే ఇక్కడ వీరిద్దరినీ కొనసాగించడానికి వేరే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కొడాలితో చంద్రబాబుకి, పేర్ని నానితో పవన్‌ కల్యాణ్‌కు చెక్ పెట్టాలని సిఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వారిద్దరినీ బలంగా ఎదుర్కొంటున్నవారు మంత్రివర్గంలో ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ వీరిద్దరికే సిఎం జగన్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఇప్పుడు మంత్రి పదవులు కోల్పోబోతున్నవారందరికీ అసమర్దులనే ముద్ర పడిపోతుంది. సాక్షాత్ సిఎం జగన్ అసమర్ధులని భావించి మంత్రి పదవిలో నుంచి తొలగిస్తే ఇక ప్రజలు మాత్రం వారిని ఎందుకు నమ్మి మళ్ళీ ఓట్లేస్తారు? కనుక ఈ అపఖ్యాతితో వచ్చే ఎన్నికలలో వారు ఓడిపోయే ప్రమాదం ఉంటుంది కనుక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నవారికే వచ్చే ఎన్నికలలో ‘చక్రం తిప్పే వెసులుబాటు’ మరి కాస్త ఎక్కువగా ఉంటుంది కనుక ఈసారైనా మంత్రిపదవి లభించాలని మొక్కులు మొక్కుతున్నవారు వైసీపీలో చాలామందే ఉన్నారు. వారిలో

చిత్తూరు జిల్లా, నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. తాను చంద్రబాబు జిల్లాకు చెందిన మహిళా నేత కావడం, చంద్రబాబు, లోకేష్‌లపై నిత్యం విమర్శలు కురిపిస్తూనే ఉండటం తన ప్లస్ పాయింట్స్ అని ఆమె భావిస్తున్నారు. కనుక ఈ క్వాలిఫికేషన్‌లతో ఈసారైనా జగనన్న తనను మంత్రివర్గంలో తీసుకోవచ్చని రోజా ఆశపడుతున్నారు. మరి జగనన్న ఎవరిని కుర్చీలో నుంచి దింపేస్తారో కొత్తగా ఎవరిని కూర్చోబెడతారో తెలియాలంటే ఉగాది వరకు వేచి చూడక తప్పదు.