Kodali Naniవైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మాటలు భలే చిత్రంగా ఉంటాయి. ఇక మంత్రి కొడాలి నాని వంటి వారి మాటలకైతే అసలు అడ్డుఅదుపు ఉండదు. తాజాగా చంద్రబాబు కుప్పంలో గెలవరు ఇక అంటూ జోస్యం చెప్పారు ఆయన. “చంద్రగిరిలో ప్రజలు ఓడించడంతోనే చంద్రబాబు కుప్పంకు వలస వెళ్లారు.

ఇప్పుడు కుప్పం వదిలి మరో నియోజకవర్గం వెతుక్కుంటారు,” అన్నారు ఆయన. ఇక చంద్రబాబు, లోకేష్‌ వార్డు మెంబర్లుగా కూడా గెలవలేరు అంటూ ఖచ్చితంగా చెప్పేశారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుండి వరుసగా ఏడు సార్లు గెలిచారు. లోకల్ ఎన్నికలలో గెలిచి ఇక చంద్రబాబు గెలవడం సాధ్యం కాదు అని చెప్పడం విశేషం.

అధికార మత్తు లో ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేస్తే అసలుకే మోసం జరగొచ్చు. గతంలో పులివెందులలో జగన్ చిన్నాన్న వివేకాను ఓడించి అప్పట్లో టీడీపీ వారు కూడా ఇలానే ప్రగల్బాలు పలికే వారు. ఆ తరువాత ఏమైందో మనకు తెలుసు. అంత చెప్పి రాయలసీమ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది మూడే సీట్లు.

ప్రజాస్వామ్యంలో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. అది అప్పుడు టీడీపీకైనా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కైనా. ప్రత్యర్థులను అందులోనూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబును తక్కువ అంచనా వేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ కే అది మంచిది కాదు.