Kesineni Nani - Nitin Gadkari- Chandrababu Naidu -TDP - Kanakadurga flyoverవిజయవాడ కనకదుర్గ గుడి వద్ద కృష్ణా నది మీదుగా నిర్మించిన ఫ్లై ఓవర్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో చాలా వరకూ నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫ్లై ఓవర్ ఆ తరువాత కొత్త ప్రభుత్వంలో పూర్తి అయ్యింది.

అయితే కొంత పని పూర్తి చేసి మొత్తం క్రెడిట్ తమదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ వారు. దీనిపై సోషల్ మీడియాలో ఆ పార్టీ … తెలుగుదేశం సోషల్ మీడియా మద్దతుదారుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో విశేషం ఏమిటంటే… వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా ఈ ఫ్లై ఓవర్ కు వ్యతిరేకంగా ఎన్నో విమర్శలు చేసేది. అసలు నిర్మాణమే సాధ్యం కాదని చెప్పేది.

అయితే టీడీపీ దగ్గర ఎంత చేసినా కేంద్రంలోని బీజేపీ విషయంలో మాత్రమే ఒదిగే ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వం. ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని ఈ ప్రాజెక్టు విషయంలో అందించిన సహకారానికి అభినందించారు.

ఆ తర్వాత తమ రాష్ట్రానికి కావల్సిన మరికొన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేసుకున్నారు. మరింతగా చర్చించడానికి ముఖ్యమంత్రిని గడ్కరీ ఢిల్లీకి ఆహ్వానించడం విశేషం. మొత్తానికి టీడీపీ ముందు ఎగిరిపడినా వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీ ముందు మాత్రం ఆ సాహసం చెయ్యడం లేదు.