వైఎస్సార్సీపీ గాలిలో కూడా రెండోసారి విజయవాడ ఎంపీగా ఎన్నికయ్యారు కేశినేని నాని. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడుగా తనకు అవకాశం ఇవ్వకపోవడంతో స్వపక్షంలో విపక్షంగా తయారయ్యారు ఆయన. రోజూ ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా సొంత పార్టీ నేతల మీదే నర్మగర్భంగా విమర్శలు చేస్తున్నారు ఆయన. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు ఆయనకు రోజూ చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.
దీనితో కేశినేని నాని కూడా బీజేపీకి వెళ్లడం ఖాయమని చాలా మంది భావించారు. అయితే ఆ విధంగానూ సంకేతాలు ఇవ్వడం లేదు ఆయన. పార్లమెంట్ లో బీజేపీ ని పలు విషయాలలో నిలదీస్తున్నారు ఆయన. అదే విధంగా ఈరోజు ఆ పార్టీ కర్నాటక లో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని కూడా ఆయన విమర్శించారు. కర్నాటక గవర్నర్ వాజుభాయ్ వాలా గతంలో 2002లో మోడీ కోసం రాజకోట్ సీటు ఖాళీ చేశారు.
ఆ తరువాత చాలా సంవత్సరాల పాటు గుజరాత్ స్పీకర్ గా కూడా చేశారని ఆయనకు అసెంబ్లీలో జరిగే వాటిపై గవర్నర్ పెత్తనం కుదరదని తెలీదా అని కేశినేని నాని ఎద్దేవా చేశారు. నర్మగర్భంగా గవర్నర్ ద్వారా బీజేపీ కర్ణాటకని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని కేశినేని నాని ఆరోపించారు. దీన్నిబట్టి ఆయనకు బీజేపీలోకి వెళ్లే అభిప్రాయం లేనట్టుగా అర్ధం అవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం లేదు. ఇక జనసేన అయితే ఆ అనుమానమే అక్కర్లేదు. కేశినేని నాని గేమ్ ప్లాన్ ఏమైనట్టు? ఎందుకు ఆయన స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తున్నారు?