Kesineni - Nani - Devineni Umaతెలుగుదేశం పార్టీలో ముసలం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనపడటం లేదు. కొద్ది రోజుల క్రితం పార్టీలో తనకు సరైన పదవి దక్కలేదని ధిక్కార స్వరం వినిపించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు మరోసారి వార్తలకు ఎక్కారు. చంద్రబాబు పిలిచి మాట్లాడటంతో తగ్గినట్టుగానే కనిపించిన కేశినేని నాని ఇవాళ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు… ఈ సారి నేరుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేశారు

కేశిశేని నాని.. “కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి!!!” అంటూ హాట్ పోస్ట్ పెట్టారు. ఓవైపు దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూనే… మరోవైపు కొడాలి నానిపై సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ ఫేస్ బుక్ పోస్ట్.. ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి గెలిచిన కొడాలి నాని.. టీడీపీ నేత దేవినేనికి కృతజ్ఞుడిగా ఉండడం ఏంటి? అని చెవులు కొరుకుంటున్నారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కు వ్యతిరేకంగా ఉమ పని చేశారా అనే అనుమానం రాకమానదు.

ఏది ఏమైనా ఇటీవలే చవిచూసిన ఘోరపరాజయం నుండి ఇంకా బయటపడని తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. అలాగని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ కేవలం మూడంటే మూడు ఎంపీలను గెలుచుకుంది. గెలిచిన ముగ్గురూ – నాని, జయదేవ్, రామ్ మోహన్ నాయుడు జూనియర్లే కావడం విశేషం. అవమానభారంతో కుంగిపోతున్న టీడీపీకు ఈ పేస్ బుక్ రాజకీయం కంటి మీద కునుకులేకుండా చేస్తుంది.