KCR warns drug peddlersతెలంగాణలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఏ ఒక్క ప్రముఖుడినీ వదిలేది లేదని సీఎం కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న ఈ మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకిలిస్తానని గోల్కొండ కోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. సినీ ప్రముఖులైనా, రాజకీయ నాయకులైనా, వ్యాపారులైనా మత్తుమందుల వాడకంలో నేరం నిరూపితమైతే చట్టం ముందు ఎవ్వరైనా ఒక్కటేనని, ఎవరికైనా ఒకటే శిక్ష తప్పదని అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఎకరా పొలానికీ నీరివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపిన కేసీఆర్, అన్ని చెరువులనూ పునరుద్ధరిస్తామని అన్నారు. కోటి ఎకరాలకు నీరివ్వడమే తన కలని, దాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వ అధికారులందరూ కలసి రావాలని కోరారు. ఇటీవలే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునర్ వైభవాన్ని కల్పించేందుకు పనులు ప్రారంభించామని గుర్తు చేసిన కేసీఆర్, వచ్చే సంవత్సరం నుంచి రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నామని, ఎకరానికి 8 వేల చొప్పున రైతుకు అందిస్తామని తెలిపారు.