కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసింది. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లో హాస్టల్ మరియు పేయింగ్ గెస్ట్హౌస్ నిర్వాహకులు అందులో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులను ఉన్నపళంగా ఖాళీ చేయించడంపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఉద్యోగులు, విద్యార్ధులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది.
దీనితో మానవతాదృక్పథంతో అలోచించి తెలంగాణ ప్రభుత్వం వారిని స్థానిక పోలీసు స్టేషన్లను సంప్రదించి తమ తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు స్పెషల్ పాసులు ఇవ్వడం ప్రారంభించారు. సరిగ్గా ఇదే పొరపాటుగా పరిణమించింది. ఉన్నఫళంగా నగరంలోని కొన్ని పోలీసు స్టేషన్లకు వేల సంఖ్యలో విద్యార్ధులు, ఉద్యోగులు చేరుకున్నారు.
చాలా మందికి పాసులు ఇచ్చినా, అలా ఒకేచోట అంత మంది గుమ్మి కూడడం ప్రమాదంగా మారింది. విజయవాడ వైపు వెళ్లే రోడ్లు అన్నీ జనమయం అయిపోయాయి. దీనితో తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసినట్టు తెలుసుకుంది. దీనిపై తెలంగాణ డీజీపీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు.
హాస్టల్, పేయింగ్ గెస్ట్హౌస్ నిర్వహకులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్కరనీ కూడా హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించవద్దని, అనవసరంగా భయాందోళనను సృష్టించవద్దని నిర్వాహకులకు సూచించారు. స్థానిక పోలీసులను హాస్టల్ నిర్వాహకులతో మీటింగులు పెట్టి మాట్లాడమని చెప్పారు. అదే విధంగా ఇక ఎవరికీ పాసులు జారీ చెయ్యవద్దని హుకుం జారీ చేశారు.