తన దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు రెండో రోజైన ఆదివారం కేంద్ర హోం, ఆర్థికశాఖ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, షెడ్యూల్ 9, 10లోని సంస్థల సమస్యల పరిష్కారం, దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన అంశాలను ప్రస్తావించారట.
కొన్ని కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయని.. ఇప్పటికే తాము సుప్రీంలోనూ దీనిపై పిటిషన్ వేశామని.. ఈ వారంలో అది విచారణకు వచ్చే అవకాశం ఉందని హోం మంత్రి చెప్పారట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని మీడియా సంస్థలకు తెలిపింది. అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలో ఎందుకు ఉన్నారో రాష్ట్రంలో ఎవరికీ తెలియనిది కాదు.
నవంబర్ లో జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు రప్పించాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు. అయితే దీనికి కేంద్రం సహకారం కూడా అవసరం అవ్వడంతో ఆయన ఢిల్లీలో కేంద్రంలోని కీలకమైన మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీని కూడా కలిశారు ఇదే విషయంగా. పైకి మాత్రం రాష్ట్ర సమస్యలు అంటూ వేరే రాగం అందుకుంటున్నారు.