ప్రస్తుత యుగంలో ‘క్యాబ్’ల గురించి తెలియని వారుండకపోవచ్చు. ఒక్క ఫోన్ కాల్ తోనో, యాప్ బుకింగ్ తోనో కారు మన ఇంటి ముందు వేచి ఉండే తీరు ప్రస్తుత తరాన్ని విపరీతంగా ఆకర్షించింది. అయితే ఈ బుకింగ్ అయ్యే వ్యయం వలన అన్ని వర్గాల ప్రజలకు చేరువకాలేదు. అయితే ఇలాంటి క్యాబ్ సర్వీస్ మాదిరే కారు స్థానంలో ఆర్టీసీ బస్సు ఉంటే… ఏంటి యాప్ బుకింగ్ తో ఆర్టీసీ బస్సు మన ఇంటి ముందుకు వస్తుందా..? అన్ని ముందర బిత్తరపోవడం ప్రజల వంతవుతున్నా… ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయానికి “కేసీఆర్ గ్యారేజ్” శ్రీకారం చుట్టనుంది.
ఈ దసరా నుండి ప్రయోగాత్మకంగా ఈ సర్వీస్ లను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత హైదరాబాద్ నుండి నిజామాబాద్ రూట్ లో 20 మినీ బస్సులను ప్రారంభిస్తారు. ప్రజల నుండి వచ్చిన స్పందనను చూసిన పిదప మలి దశలలో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ సర్వీస్ లను ప్రారంభించనున్నారు. ఇందు నిమిత్తం కొత్తగా 236 మినీ బస్సులను కొనుగోలు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది.
100 ఏసీ బస్సులను పట్టణ ప్రాంతాల్లో తిప్పే విధంగా, అలాగే మిగిలిన బస్సులను గ్రామీణ ప్రాంతాలకు పరిమితం చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు వెల్లడించారు. అయితే ఈ బస్సులను బుక్ చేసుకోవాలనుకునే వారి కోసం ఓ సరికొత్త యాప్ ను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే… “ఇంటి వాకిట్లో… ఆర్టీసీ బస్సు…” ఉన్నట్లే..!