తెలంగాణ ఉద్యమంలో దర్శకుడు ఎన్‌.శంక‌ర్ చురుగ్గా పాల్గొన్నారు. జైబోలో తెలంగాణ అనే సినిమాని కూడా తీశారు. ఆయన సేవలకు ప్రతిగా ఐదు ఎక‌రాల స్థ‌లం అంద చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. స్టుడియో కడుతాన‌నీ, స్థ‌లం కావాల‌ని శంక‌ర్‌ ఎప్పటినుంచో కోరుతున్నారు. దాంతో తెలంగాణ మంత్రివ‌ర్గం తాజాగా స్థ‌లం మంజూరు చేసింది. శంక‌ర్‌ప‌ల్లి సమీపంలో ఐదెకరాల స్థలం ఎకరాకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలిపారు.

శంక‌ర్‌ప‌ల్లిలో ప్ర‌స్తుతం ఎక‌రం రెండు కోట్ల రూపాయ‌ల ధ‌ర పలుకుతోంది. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ప్ర‌భుత్వం నుంచి స్టూడియో క‌ట్టేందుకు స్థ‌లం పొందిన మొద‌టి ఫిల్మ్‌మేక‌ర్‌…ఎన్‌.శంక‌ర్‌. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో స్టూడియోల కోసం స్థ‌లం తీసుకున్న‌వారంతా ఆంధ్ర‌ప్రాంతానికి చెందిన నిర్మాత‌లే. అలాగే వారికి 70, 80, 90ల‌లో స్థలాలు ఇచ్చారు. అపుడు ఇప్ప‌టి రేంజ్‌లో ధ‌ర‌లు లేవు. ఇది ఇలా ఉండగా శంకర్ దగ్గర స్టూడియో నిర్మించే అంత డబ్బు ఎక్కడ ఉందని ఆశ్చర్యపోతున్నారు పలువురు సినీ పెద్దలు.

స్టూడియో నిర్మాణానికి, అందులోని వసతులకు తడిచి మోపెడు అవుతుంది. అయితే ఇప్పుడు ఆ ఐదెకరాల స్థలాన్ని చూపించి, లేదా బ్యాంకులో తనకా పెట్టి గానీ డబ్బు తీసుకునిరావాలని యోచిస్తున్నారంట శంకర్. 2011లో జైబోలో తెలంగాణ సినిమా తీసిన శంకర్ 2017 వరకు ఖాళీగానే ఉన్నారు. ఆ సంవత్సరం టూ కంట్రీస్ అనే సినిమా సునీల్ తో తీసి చేతులు కాల్చుకున్నారు. అప్పటి నుండి ఇంకో సినిమాకు ప్రయత్నించలేదు. అయితే ఈ స్టూడియో కట్టగలిగితే శంకర్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే.