కరోనా కాలంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి బెడ్లు, మందులు, ఆక్సిజన్ వంటివి కూడా లేని పరిస్థితి. ప్రజల సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం అని చెప్పుకునే నాయకులకు ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం వసతులు ఏర్పాటు చెయ్యడానికి చేతులు రావడం లేదు.
అది కూడా పక్కన పెడితే కనీసం ఆసుపత్రులను సందర్శించి వసతులను తనిఖీ చెయ్యడం… బాధితులను ఓదార్చడం కూడా చెయ్యడం లేదని ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద అపవాదు ఉంది. కేసీఆర్ తన ఫామ్ హౌస్ దాటరాని ఇటు జగన్ తన తాడేపల్లి ప్యాలస్ విడిచి బయటకు రారని ఒక అపవాదు ఉంది. అయితే ఆ అపవాదుని కేసీఆర్ చెరిపేసుకున్నారు.
తెలంగాణకు ఆరోగ్యశాఖా మంత్రిగా కూడా ఉన్న ఆయన బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ వార్డులను స్వయంగా పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం కేసీఆర్ పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు.
కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి అధికారులతో చర్చించారు. అప్పటికప్పుడు అధికారులకు వసతులు మెరుగుపరచడంలో కొన్ని సూచనలు కూడా చేశారు. మొత్తంగా కేసీఆర్ తన మీద ఉన్న అపవాదుని ఈ పర్యటనతో చెరిపేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఏం చేస్తారు అనేది చూడాలి.