KCR Knows Modi Secretsపెద్ద నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మోడీ సర్కార్ కు మద్దతు ఇస్తున్నామని, కానీ బంగారం జోలికి వస్తే మాత్రం సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. అదే జరిగితే ‘ప్రత్యేక తెలంగాణా’ ఉద్యమం వంటి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతానని తేల్చి చెప్పారు.

‘పెద్ద నోట్ల రద్దు – రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ-ప్రజలపై ప్రభావం’ అంశంపై శనివారం శాసన మండలిలో జరిగిన చర్చలో కేసీఆర్ ఈ విధంగా స్పందించారు. నల్లధనంపై పోరు మొదలుపెట్టిన మోడీ చర్యలు ఇక్కడితో ఆగవని, నల్లధనం ఏ రూపంలో ఉన్నా కక్కించేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నారని మోడీ సీక్రెట్స్ ను బయటపెట్టారు. భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా అప్పు ఇచ్చేవాడు కానీ, తీసుకునేవాడు కానీ ఉండడని, అందరూ నగదు రహిత లావాదేవీలకే మొగ్గుచూపుతారని అన్నారు.

తాను ప్రధానిని కలిసినప్పుడు ‘నీ వద్ద ఎంత బంగారం ఉంది?’ అని ప్రధాని తనను అడిగారని, దానికి తాను 115 తులాలు అని చెప్పానని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1985లోనే ఆస్తులు ప్రకటించానని, అప్పుడే ఈ విషయాన్ని కూడా చెప్పానని తెలిపారు. కేంద్రం త్వరలో ‘గోల్డ్ డిక్లరేషన్’ చేయాలని ప్రజలను కోరే అవకాశం ఉందన్నారు. అయితే కిలో వరకు ఉన్న ఆభరణాల జోలికి ప్రభుత్వం రాదని, బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో ఉన్న వాళ్ల నుంచే ప్రభుత్వం లాక్కుంటుందని తెలిపారు.

హైదరాబాద్‌లో ఓ వ్యాపారి ఒక్క రాత్రే 3600 మందికి బంగారం అమ్మినట్టు కేసు నమోదైందని, అటువంటి వారు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. బంగారం తర్వాత బినామీ ఆస్తులపై కేంద్రం పడుతుందని, తమకున్న షేర్లను కూడా వెల్లడించాల్సి ఉంటుందని కేసీఆర్ తెలిపారు. డాలర్లు, విదేశీ కరెన్సీపై కేంద్రం దృష్టి సారించడంతో మనీలాండరింగ్ వంటి మోసాలు తగ్గిపోతాయని తెలంగాణా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.