సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల వైపు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.
సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలు వైద్యం, అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని ప్రకటించింది. దానిని అమలు చేయడానికి పోలీసు బలగాలను పెంచింది. ఏపీలోని కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం… అక్కడికి గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిషేధించింది.
అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల వారు విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేదు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ 60 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది, దీనితో మొత్తం కేసులు 1,463 కు చేరుకున్నాయి. ఈ కేసుల్లో 25 కేసులు కర్నూలు జిల్లాకు మాత్రమే, మరో 19 కేసులు గుంటూరుకు చెందినవి.
కర్నూల్ జిల్లాలో నాలుగు వందల కేసులు… గుంటూరులో మూడు వందల కేసులు దాటాయి. కృష్ణా జిల్లాలో కూడా 250 కేసులకు పైగా నమోదు అయ్యాయి. మరోవైపు… తెలంగాణలో ఇప్పటివరకూ 1,038 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఎక్కువగా జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నాయి.