తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను ఈనెల 27న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ప్లీనరీ సందర్భంగా 15వేల మంది ప్రతినిధులతో మేడ్చల్లో సమావేశం నిర్వహించబోతున్నారు. అనంతరం కొంపల్లిలో భారీ బహిరంగసభ ఉండబోతుంది. ముందుగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయపార్టీల నాయకులను ప్లీనరీకి పిలవాలని అనుకున్నా ఇప్పుడు ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
ఒక్క మమతా బెనర్జీని తప్ప మిగతా నాయకులను కేసీఆర్ ఇప్పటిదాకా కలవలేదు. మమతకూడా కాంగ్రెస్ కు దగ్గరగా జరుగుతున్నట్టు కనిపిస్తున్నారు. దీనితో కొంతకాలం జాతీయ నాయకులను కలవడం ఆపి తన వ్యూహాలను మార్చుకునే ప్రయత్నం చేయబోతున్నారట. బీజేపీ, కాంగ్రెస్ లేకుండా ఒక ఫ్రంట్ ఏర్పడి అధికారంలోకి రావడం అనేది జరగని పని అని దీని వల్లే కేసీఆర్ ఫ్రంట్ కు ఆదరణ లేకుండా పోయిందని పలువురు ఆయనకు తెలిపారట.
తాజాగా అక్టోబర్ లేదా నవంబర్ లలో హైదరాబాద్ లో ఒక బారీ సభను నిర్వహించాలని, సుమారు 25 లక్షల మందిని సమీకరించాలని తాజాగా ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలలో ఈ సభ జరపాలని తలపెట్టారు. ఆ సభ సమయానికి జాతీయ స్థాయి నేతలను కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు పలువురిని ఆ సభకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. అంటే అప్పటి వరకు ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ముందుకు వెళ్లనట్లే అని విశ్లేషణలు వస్తున్నాయి.