కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో ఆలయం కొత్త రూపు సంతరించుకుంటుంది. అయితే ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, తెలంగాణ చిత్రపటంలో చార్మినార్, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయ పక్షి నెమలి వంటి చిహ్నాలను చెక్కుతున్నారు.
అంతటితో ఆగితే పర్లేదు. శిల్పులు ఏకంగా అష్టభుజి ప్రాకార మండపాల బాలపాద పిల్లర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్; టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు; ప్రభుత్వ పథకాలైన తెలంగాణకు హరితహారం, కేసీఆర్ కిట్ వంటి వాటిని చెక్కి, ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. పరమ పవిత్రంగా ఉండాల్సిన దేవాలయాన్ని రాజకీయ కొలువులా మార్చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయాలని, భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారని ఆలయ శిల్పులు చెబుతున్నారు.
మరి స్వామిభక్తితో అలా చేశారో లేక ముఖ్యమంత్రి సూచించారో తెలియదు గానీ అపచారం అయితే జరిగిపోయింది. ఈ చర్యను భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలా రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ బొమ్మలు, ఆయన పథకాల బొమ్మలూ చెరిపి ఆ ప్రభుత్వ పథకాల బొమ్మలు వేయించుకోవచ్చా? ఈ సంస్కృతి ఎక్కడకి దారి తీస్తుంది? దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే భక్తుల మనోభావాలు ఘోరంగా దెబ్బ తీసినట్టే.