ttd-insulting-telangana-governmentప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భావం జరిగితే.., తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి 5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను అందజేస్తానని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో మొక్కుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని ఉద్యమం సాగించిన కేసీఆర్… ప్రస్తుతం తెలంగాణ సీఎం పీఠంపై ఆసీనులై దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తోంది.

ఇందులో భాగంగా తిరుమల వెంకన్నకు ప్రమాణం చేసిన మొక్కును తీర్చుకునేందుకు కూడా కేసీఆర్ ఇదివరకే చర్యలు చేపట్టారు. తెలంగాణ సర్కారు నిధి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖజానాకు 5 కోట్లను ఇదివరకే అందజేశారు. వెంకన్నకు తాను ఇవ్వాలని మొక్కుకున్న సాలిగ్రామ హారం, కంఠాభరణాలను తయారు చేయించాలని టీటీడీని కోరారు.

కేసీఆర్ అభ్యర్థన మేరకు సదరు ఆభరణాల తయారీ కోసం టెండర్లను పిలిచింది. మూడు సంస్థలు ఆ టెండర్లను దక్కించుకునేందుకు బిడ్లు దాఖలు చేయగా, కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ ‘కీర్తిలాల్ కాళిదాస్ జ్యువెలర్స్’ టెండర్ ను దక్కించుకుంది. 22 కేరట్ల మేలిమి బంగారంతో గ్రాము ఒక్కింటికి 2,611 చొప్పున సదరు సంస్థ, 14.9 కిలోల సాలిగ్రామ హారాన్ని 3.7 కోట్లతోనూ మరియు 4.650 కిలోల ఐదు పేటల కంఠాభరణాన్ని 1.21 కోట్లతోనూ తయారు చేసింది.

తయారీ పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే ఆ సంస్థ సదరు ఆభరణాలను టీటీడీ ఖజానాకు అందజేసింది. ఆభరణాలు అందిన విషయాన్ని కేసీఆర్ కు తెలియజేసిన టీటీడీ, తిరుమల వచ్చి స్వయంగా స్వామివారికి వాటిని బహూకరించాలని కోరింది. టీటీడీ సమాచారం నేపథ్యంలో కేసీఆర్ ఈ నెలాఖరున తిరుమల వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇఫ్పటికే కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారైనా తేదీలు మాత్రం వెల్లడి కాలేదు. దీంతో మరోసారి కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టనున్నారు.