ఎర్రమంజిల్, సచివాలయ భవనాల కూల్చివేతలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 150 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న భవనాన్ని కూల్చి వేయాలని నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. అలాగే ఎర్రమంజిల్ నిర్మాత నవాబ్ సప్దర్ జంగ్ ముషీరుద్ దౌలా ఫక్రుల్ ముల్క్ వారసులు నూరి ముజఫర్ హుస్సేన్తో పాటు మరో ఏడుగురు కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
1870లో 150 గదులతో ఎర్రమంజిల్ నిర్మించారని తెలిపారు. ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తారనే ఉద్దేశంతో 1951లో ప్రభుత్వానికి అప్పగించామని, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలని మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరారు. దీనితో కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ కేసులో తమకు అనుకూలమైన తీర్పు వస్తుందని గట్టి నమ్మకంగా ఉంది.
కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా సచివాలయం తరలింపు ప్రక్రియ వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీఆర్కే భవన్కు సచివాలయంలోని జీఏడీ విభాగం తరలించనున్న తరుణంలో బీఆర్కే భవన్ను ఖాళీ చేస్తున్నారు. భవనం 7వ అంతస్తులో ఉన్న సాంకేతిక విద్యామండలి కార్యాలయాన్ని మాసబ్ట్యాంక్కు తరలిస్తున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం నేపథ్యంలో శాఖల తరలింపు ప్రక్రియ వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం నుంచి సిబ్బంది శాఖలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అనుకూలమైన తీర్పు వస్తుందని కేసీఆర్ కు అంత నమ్మకం ఏంటో?