నరకం ఎలా ఉంటుందో తెలియదు…కానీ ఆరు మాసాల్లో ఆ నరకాన్ని చూశాను..నన్ను ఓడించేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నాలు చేసిండు. ప్రతి ఒక్కరిలోనూ నేను గెలవనన్న భావన కల్పించిండు. కానీ నా నియోజకవర్గ ప్రజలు నన్ను అక్కున చేర్చుకున్నరు. వారికోసమే నేనిప్పుడు పనిచేయాలి.
వారికి నేను మళ్లీ మోసం చేసినట్లయితే నన్ను చంపేస్తరు…..అని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ ఇవి. ఈమధ్యే నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఉపపోరులో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇప్పుడా ప్రోమో సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది.
నా శ్వాస ఉన్నంత వరకు నేను ప్రజల కోసమే పోరాడుతా….అలా చేయకుంటే నన్ను ప్రజలే బతకనివ్వరు. నన్ను ఎంత వేధించాలో…ఏవిధంగా వేధించాలో అంత వేధించారు. కానీ ప్రజాతీర్పు ఇలా ఉంటుందని అనుకోలేదు. నా నియోజకవర్గ ప్రజలకు నేనే ఏమిచ్చినా తక్కువే…వారి కోసం ఏమైనా చేస్తాను అని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు కలవనీయకుండా చేస్తున్న మొదటి సీఎం ఈయన్నే చూస్తున్నా. ఎక్కడా ఇలాంటి ముఖ్యమంత్రి లేరు…ఆయన మాటే వినాలి. తాను చెప్పిందే చేయాలి. కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు….మాకు మంత్రి పదవి ఇవ్వకున్నా బాధపడలేదు…కానీ మమ్మల్ని మనిషిలా చూడనందుకే బాధ కలిగింది.
హరీశ్ రావు నేను మంచి స్నేహితులం. కానీ హుజురాబాద్ ఉపపోరులో హరీశ్ రావుకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించి ఆయన పరువు తీశారు. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలన్నారు.