Kasthuri-Shankarఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) – కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై తమిళనాడు క్రికెట్ అభిమానుల తరపున రచయిత, విశ్లేషకురాలు, ప్రముఖ సినీ నటి కస్తూరి శంకర్ క్షమాపణలు చెప్పారు. కావేరీ జల వివాదం నేపథ్యంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణను తమిళులు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

తొలి మ్యాచ్ ను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు 4000 మంది పోలీసులతో చిదంబరం స్టేడియంకు భద్రత కల్పించారు. అయినప్పటికీ పలువురు అభిమానులు స్టేడియంలోకి చెప్పులు విసరగా, బౌండరీలైన్ బయట ఉన్న డుప్లెసిస్, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా వాటిని బయటకు విసిరేశారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆమె డుప్లెసిస్‌, జడేజాలను ట్యాగ్‌ చేస్తూ, క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత పలువురు అభిమానులు వారిని ట్యాగ్ చేస్తూ, ‘మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. స్టేడియంలో జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాం. మా గురించి తప్పుగా భావించొద్దు. మీరంటే మాకు అమితమైన గౌరవం ఉంది.’ అంటూ ట్వీట్లు చేశారు.