వచ్చే నెలలో జరిగే కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. సాధారణ ఎన్నికలకు ఒక నెల ముందు జరగబోయే ఈ ఎన్నికల ఫలితం సాధారణ ఎన్నికల మీద కూడా ఉంటుందని అంచనా. దీనితో అందరి దృష్టి ఈ ఫలితాల మీదే. మరోవైపు తెలుగు వారు కూడా ఈ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
ఇండియా టుడే–కార్వీ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతుంది. రాష్ట్రంలో హంగ్ రాబోతోందని, కాంగ్రెస్ (90–101 సీట్లలో గెలుపు) అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని, జేడీఎస్ (34–43 సీట్లు) కింగ్ మేకర్ పాత్ర పోషించబోతోందని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే, బీజేపీ(78–86 సీట్లు)కి ఓట్ల శాతం పెరుగుతుంది కానీ, మెజారిటీకి మాత్రం దూరంగానే ఉంటుందని తేలింది.
బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కన్నా సీఎంగా సిద్దరామయ్యకే ఎక్కువ మద్దతు లభించడం విశేషం. 225 మంది ఎమ్మెల్యే (ఒక నామినేటెడ్ ఆంగ్లో సాక్సన్)లున్న కన్నడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 113 సీట్లు కావాలి. దీనితో జేడీఎస్ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతుంది.