మెగాస్టార్ చిరంజీవిపై ఒక్కసారిగా విరుచుకుపడి మీడియా వర్గాలను ఆకర్షించడంలో విజయవంతం అయ్యారు ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, కేంద్ర మంత్రి పదవిలో ఉండగా చిరంజీవి కాపులకు ఏం చేశారని… కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుంటే… ప్రభుత్వంపై ముద్రగడ పద్మనాభం అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దానికి చిరంజీవి వంత పాడుతున్నారని, ముద్రగడకు మద్దతుగా నిలుస్తూ… చిరంజీవి కాపులకు అన్యాయం చేసే దిశగానే పయనిస్తున్నారని తీవ్ర ఆగ్రహంతో కూడిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి చిరంజీవిపై స్పందించిన రామానుజయ… “ఓ సినీ హీరోగా చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఒకప్పుడు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం ఉండేదని, కానీ ఇపుడు చిరంజీవి తీరు ఇప్పుడు తనకు నచ్చడం లేదని…” అన్నారు. ఆయన వ్యవహార శైలితో కాపుల్లోని ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతోందని, కాపుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చూస్తే, కాపు జాతి ఆగ్రహాన్ని చిరంజీవి చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్ జగన్ పన్నిన కుట్రలో కొంతమంది చిక్కుకుని చంద్రబాబును విమర్శిస్తుంటే, వారితో చిరంజీవి చేరాడని, ఇది ఎంతవరకూ సమంజసమో ఆయనే ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
చిరుపై ఈ రేంజ్ లో స్పందించిన ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మెన్ రామానుజయ, గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు కూడా ఓ బహిరంగ లేఖ రాశారు. కాపు నేతలు వైసీపీ వలలో పడరాదని, ప్రభుత్వం ఇప్పటికే కాపుల సంక్షేమానికి 885 కోట్లు ఖర్చు చేసిందని, కాపుల అభ్యున్నతికి కట్టుబడ్డ తమ ప్రభుత్వం పట్ల అనుమానం వ్యక్తం చేయడం సబబు కాదని, విపక్షం మాయలో పడి కాపు జాతికి అన్యాయం చేయొద్దని దాసరికి కూడా సూచించిన విషయం తెలిసిందే.