తాను అనుకున్నది చేసి తీరేందుకు ఎంత దూరమైన వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు నిరూపించుకున్నారు. ఆ వైఖరి వల్ల ఈ మధ్య కాలంలో కోర్టులలో ఇబ్బంది పడుతున్నారు కూడా. ఇదే సమయంలో సొంత పార్టీ ఎంపీ ఒకరు ముఖ్యమంత్రి మీదే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆ ఎంపీ నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు.
నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…. తనను కనీసం సంప్రదించకుండా బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజుని పార్టీలోకి తెచ్చి, నరసాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడంతో రఘు రామకృష్ణంరాజు అలిగారు. అప్పటి నుండి ధిక్కర స్వరం వినిపిస్తున్నారు.
తాను పార్టీలోనే ఉంటా అని, కాకపోతే సీటు ఇవ్వకపోతే వేరే పార్టీ నుండి పోటీ చెయ్యడానికి వెనుకాడబోనని తేల్చి చెప్పారు. కొందరు రాజకీయ విశ్లేషకులు… ఈ ఎంపీ జగన్ చేత సస్పెండ్ చేయించుకోవడానికి ఆరాటపడుతున్నారని, అదే జరిగితే సేఫ్ గా బీజేపీలో వెళ్లి చేరవచ్చని ఆయన వ్యూహం అని వారు అంటున్నారు.
ఇది కనిపెట్టే జగన్ ఈయన విషయంలో సైలెంట్ గా ఉన్నారని వారు అంచనా వేస్తున్నారు. గతంలో జగన్ కేసుల విషయంలో ఇబ్బంది పడుతున్న సమయంలో రఘురామ కృష్ణం రాజు జగన్ కు అండగా నిలిచారు. ఆ తరువాత ఆయనతో విభేదించి టీడీపీలో చేరారు. ఆ సమయంలో జగన్ మీద గట్టిగానే విమర్శలు చేశారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి నరసాపురం పార్లమెంట్ కు పోటీ చేసి గెలిచారు.