కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఎవరూ ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.. కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం పార్టీ అసలు ప్రయత్నమే చేయలేదని, కేంద్రం స్టీల్ప్లాంట్ ఇస్తామంటుంటే.. కావాలనే కడపలో డ్రామాలు ఆడుతున్నారని ఆయన చెప్పారు
ఈ డ్రామాలో సీఎం రమేష్ పాత్రధారి. చంద్రబాబు డైరెక్టర్. ఇకనైనా డ్రామాలు ఆపాలిని ఆయన విమర్శించారు. అయితే కన్నా చెప్పేది పూర్తి వాస్తవవిరుద్దంగా ఉంది. కేంద్రం కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టులో తెలిపాకనే వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు కేంద్రం ఇస్తామంటే రాష్ట్రప్రభుత్వం అడ్డుపడుతోందని చెప్పడం ఏంటో ఆయనకే తెలియాలి.
పైన కేంద్రంలో జరుగుతుంది ఒకటి కింద ఇక్కడ రాష్ట్ర నాయకులు చెబుతున్నది ఇంకొకటి. ఇటువంటి పరస్పర విరుద్ధ వైఖరుల వల్ల ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని గ్రహిస్తే వారికే మంచిది. ఇటువంటి చేష్టలతో ప్రజలు మభ్యపెట్టగలం అనుకోవడం కూడా వారికే చెల్లింది.