ఇటీవలే నియమితులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని పటిష్ఠపరచడమే లక్ష్యంగా రాష్ట్రమంతా కలియతిరుగుతున్నారు. ఆయన వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక రూపంలో నిరసన ఎదురవుతూనే ఉంది. అయితే అదంతా టీడీపీ వారి కుట్ర అని చెప్పుకుంటూ సమాధాన పడిపోతున్నారు కమలం పార్టీ వారు.
అయితే రాష్ట్రంలో బీజేపీపై కోపం ఎక్కువగా ఉందని కన్నా తో సహా అందరికి తెలిసిన విషయమే. ఇప్పటివరకు బీజేపీకి రాష్ట్రంలో ఆదరణ మాత్రమే లేదు. అయితే కొత్తగా పార్టీ మీద అక్కసు కూడా మొదలైంది. ఆదరణ లేకపోతే ఇటువంటి యాత్రల ద్వారా ఏదో రకంగా పెంచుకోవచ్చు. అయితే ప్రజలలో కోపం ఉంటే దానిని తగ్గించడం అంత తేలిక కాదు.
రాజకీయాల్లో తలపండిపోయిన కన్నాకు ఇది తెలియనిది కాదు. బీజేపీలోని సోము వీర్రాజు వంటి వారికి ప్రజా రాజకీయాలతో సంబంధాలు తక్కువ అయితే కన్నా అలా కాదు. అయినా ఆయన వాస్తవ స్థితి తెలుసుకోలేకపోతున్నారు. అయితే మునిగే నావ అని తెలిసి కూడా కన్నా ఎక్కారు. నావను కాపాడాల్సింది పోయి ఆయన కూడా కలిసి మునుగుతా అంటున్నారు.