Kanna Lakshmi Narayana fires on YSR Congress Governmentబీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎదురు దాడి మొదలు పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రభుత్వం పై దాదాపుగా అన్ని విషయాలలో పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.

“రంగులేసుకోవడానికి,ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసీపీ. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృతిమకొరత సృష్టించి రూ.150 కూలీ కూడా రాని పరిస్థితికి భవననిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు,” అంటూ తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ చిన్న స్థాయి నాయకుల వరకూ అంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వీర విధేయత ప్రదర్శిస్తున్నా ఈ ఎదురుదాడి ఆపకపోవడం విశేషం. అయితే చంద్రబాబు మీద గానీ, పవన్ కళ్యాణ్ గానీ గంటల తరబడి మైకులు ముందుకు వచ్చి బూతులు తిట్టే నాయకులు బీజేపీ చేస్తున్న కామెంట్స్ మీద మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం విశేషం.

ఎక్కడ ఎదురుతిరిగితే ఎక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారా అనే భయం అధికార పార్టీ నేతలలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వైఖరి బానే ఉంటుంది. ఇటువంటి నేతలు మనకు ప్రత్యేక హోదా సాధిస్తారా? మన హక్కుల కోసం పోరాడతారా అని ప్రజలకు డౌట్ వచ్చిన నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు.