Kanna Lakshmi Narayana comments on Chandrababu naidu and nara lokeshచిత్తూరు జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధినేత కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయిందని, టిడిపి కోలుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. దానికి కారణం చంద్రబాబు వయసు అయిపోతే, లోకేష్ కు వాయిస్ లేకపోవడమేనని ఆయన అన్నారు. దీంతో టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందన్నారు. రానున్న ఎన్నికల సమయానికి బీజేపీ ప్రబలశక్తిగా మారబోతుందని ఆయన జోస్యం చెప్పారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే వచ్చే నెలలో కన్నా లక్ష్మీనారాయణ 64వ పడిలోకి వెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు వయసు 69 ఏళ్ళు. తనకంటే వయసులో ఐదేళ్లు పెద్దయిన తన కంటే ఆరోగ్యంగా ఉండే చంద్రబాబును కన్నా వయసు అయిపోయిందని ఎద్దేవా చెయ్యడం విశేషం. చంద్రబాబు పార్టీని సున్నా నుండి నిర్మించక్కర్లేదు. పాపం కన్నా 64ఏళ్ళ వయసులో ఆంధ్రప్రదేశ్ 0.8% ఉన్న పార్టీని 2024 నాటికి ప్రబలశక్తిగా మారచడానికి కష్టపడాలి అంటూ టీడీపీ కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఒకప్పటి కాంగ్రెస్ నేతలను, టీడీపీ నేతలను కన్నా లక్ష్మీనారాయణ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాత్కాలికంగా పార్టీలోకి వచ్చినా ఆ తరువాత ఎన్నికల ముందు తమ దారి తాము చూసుకుంటారని బీజేపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పార్టీని ప్రజలలోకి తీసుకునివెళ్ళకుండా వలసనేతల మీద ఆధారపడితే అది పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడదని వారి అభిప్రాయం. అయితే ఇలా చెయ్యడం వల్ల టీడీపీని దెబ్బ తీసి ఆ ప్లేస్ తాము ఆక్రమిస్తామని బీజేపీ హైకమాండ్ ఆలోచన.