Kamma Rajyam Lo Kadapa Reddlu Trailer-2రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సరికొత్త ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల చేశాడు. ఈ ట్రైలర్ లో మరి కొన్ని వివాదాలను టచ్ చేశాడు రాము. తెలుగుదేశం పార్టీ ఓటమి, చంద్రబాబు వయసు, లోకేష్ నాయకత్వం మీద అనుమానాలు వంటి విషయాలను స్పృశించాడు రాము.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని లాగేసుకుంటాడేమో అనే భయంలో చంద్రబాబు ఉన్నట్టుగా కూడా చూపించడం గమనార్హం. కొడుకు మీద ప్రేమతో టీడీపీని సర్వనాశనం చేశారని, అలాగే అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీని రాగ్గింగ్ చేస్తుందని కూడా చూపించాడు. జగన్ అసెంబ్లీలో అచ్చెన్నాయుడుని కూర్చో అంటూ పరుష వ్యాఖ్యలు చెయ్యడం, చంద్రబాబుని ఎక్కిరించడం, స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ లో కునుకు తియ్యడం వంటి వాటిని కూడా చూపించారు.

ట్రైలర్ లోని తరువాతి భాగంలో కొన్ని అభ్యంతరకరమైన అభూతకల్పనలకు కూడా తెగబడ్డారు రాము. వంగవీటి రాధాను టీడీపీనే చంపించిందని లోకేష్ అన్నట్టు, జగన్ ప్రభుత్వాన్ని కూలదోయ్యడానికి చంద్రబాబు హత్యారాజకీయాలకు పూనుకున్నట్టు. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అరెస్టు కు పూనుకున్నట్టు, ఆ తరువాతి పరిస్థితుల వల్ల జగన్ రాజీనామా చేసినట్టు చూపించారు.

రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ చిత్రం తెలుగు రాజకీయాలలో అనవసర వివాదాలు రేకెత్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ నెల 29న విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడు రాము. ఇప్పటివరకు సినిమాను కొనడానికి బయర్లు ఎవరూ ముందుకు రాలేదు. కొత్త ట్రైలర్ తరువాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది.