యూనివర్సల్ హీరో కమల్హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్బాస్-3 కార్యక్రమ ప్రసారానికి స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిగ్బాస్ సీజన్ 1, సీజన్ 2 పెద్ద హిట్ కావడంతో బిగ్బాస్-3 కార్యక్రమం విజయ్ టీవీ ఛానెల్లో 23వ తేదీ ప్రారంభించడానికి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి, దానిని ప్రసారం చేసే టీవీ ఛానెల్పై మద్రాసు హైకోర్టులో ఒక న్యాయవాది బుధవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు.
పెటిషర్ ప్రకారం బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొనే పోటీదారులు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని, ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇది యువతకు పరిపాటియైనా తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు ముందుగా సెన్సార్ బోర్డు తనిఖీ చేయాలని కోరారు. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. హిందీలో మొదట మొదలైన బిగ్ బాస్ షో ఆ తరువాత తెలుగు, తమిళ భాషలలోకి వచ్చింది.
తెలుగులో మొదటి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టుగా వ్యవహరించారు. అయితే వారిద్దరూ ఒప్పుకోకపోవడంతో మూడవ సీజన్ కు నాగార్జునను తెర మీదకు తెచ్చారు. జులై నుండి షో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. త్వరలో ఈ షోకు సంబంధించిన ప్రోమోలు మా టీవిలో ప్రసారం కాబోతున్నాయి. అయితే తమిళంలో మాత్రం మూడు సీజన్లకు కమల్హాసన్ హోస్టుగా వ్యవహరించడం విశేషం. తెలుగు బిగ్ బాస్ మీద కూడా గతంలో ఇదే రకమైన విమర్శలు వచ్చాయి.