టాలీవుడ్ లో కొత్తదనం పుంతలు తొక్కుతోన్న వేళ… పలువురు ఔత్సాహిక దర్శకులు తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఆస్కారం లభిస్తోంది. అందులో భాగంగానే సంపత్ వి కుమార్ అనే దర్శకుడు తన కలను నిజం చేసుకునే క్రమంలో “కల వరం ఆయే” అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ నెల 21వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
దర్శకుడు కావాలనుకుంటున్న ఓ వ్యక్తి, తన నిద్రలో ఉండగా వచ్చిన కలను కధగా మలచడమే ఈ సినిమా మూలకధలా కనపడుతోంది. చూడడానికి షార్ట్ ఫిల్మ్ కంటెంట్ లా ఉన్నప్పటికీ, పకడ్భందీ స్క్రీన్ ప్లే గనుక ఉన్నట్లయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదన్న నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగించింది. మధుసూదన్ రెడ్డి ఫోటోగ్రఫీ, భరత్ శంకర్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం సినిమా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
అయితే ఈ కలలపై ఇప్పటికే రాజేంద్రప్రసాద్ “డ్రీం” అనే సినిమా, కలర్స్ స్వాతి “త్రిపుర” అనే సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. నటకిరీటీ ‘డ్రీం’ సినిమా కలలపై పరిశోధనాత్మక చిత్రం కాగా, స్వాతి ‘త్రిపుర’ కమర్షియల్ కోణంలో చిత్రీకరించారు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే “కల వరం ఆయే” సినిమాగా కనపడుతోంది. ట్రైలర్ అయితే కొత్తదనంతో నిండుకుని ఉండడంతో చూసిన నిముషంన్నర్రకు ఫుల్ హ్యాపీ. ఇదే విధంగా రెండు గంటల సినిమా ఉంటే చిత్ర నిర్మాతలు ఇంకా హ్యాపీ.