Kakinada Bhimavaram Palakollu submerged in bay of bengalఆంధ్రప్రదేశ్ లో పచ్చదనానికి మారుపేరుగా నిలిచిన కాకినాడ, భీమవరం, పాలకొల్లు ప్రాంతాలు మరో పదేళ్లలో సముద్ర గర్భంలో కలిసిపోనున్నాయా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు మరియు స్థానిక వాసులు. దీనికి కారణం గ్లోబల్ వార్మింగో లేక, పెరుగుతున్న సముద్ర మట్టాలో కాదని చెబుతున్నారు. కాకినాడ తీరంలో పాగా వేసిన చమురు వెలికితీసే సంస్థలు అడ్డగోలు తవ్వకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అడ్డగోలుగా సహజవాయు నిక్షేపాలు తవ్వుకుని తీసుకుపోతుండడంతో, ఆ దాని ప్రభావం తమపై పడుతోందని, తమ జీవనాధారం, కొంప, గోడు, గొడ్డు, గోద మొత్తం అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని భయబ్రాంతులు చెందుతున్నారు. విశాఖపట్టణంలో ఏడాదికి 0.65 సెంటీ మీటర్ల సముద్ర మట్టం పెరుగుతుండగా, గత నాలుగైదేళ్లలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఈ మూడు ప్రాంతాలు మాత్రం ఐదు అడుగుల లోతుకు భూమిలోకి దిగబడిపోయాయని చెబుతున్నారు.

ఈ మేరకు పలువురు నిపుణులతో కూడిన కృష్ణా, గోదావరి పరిరక్షణ సమితి ఆందోళణ వ్యక్తం చేస్తోంది. రాజకీయ పార్టీలన్నీ కలిపి దీనిపై పోరాడితేనే ఇక్కడి ప్రజల మనుగడ ఉంటుందని, లేని పక్షంలో వివిధ ప్రాంతాలకు వలసపోయి జీవనోపాధిని వెతుక్కోవడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సహజ వాయువు నిక్షేపాలు కేంద్రంతో కూడుకుని ఉన్న అంశం కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు చొరవ చూపిస్తుందనేది ప్రశ్నార్ధకమే!