ఒకప్పుడు కడప జిల్లా అంటే వైయస్ ఫ్యామిలీకి అడ్డా. అయితే వైఎస్సార్ మరణం నుండి కాలక్రమేణా ఆ ప్రభావాన్ని వైయస్ కుటుంబం కోల్పోతూ వస్తోంది. అది ఇటీవల కాలంలో పతాక స్థాయికి చేరుకుంది. సొంత పార్టీ వారే జగన్ కు షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయిన వైనాన్ని ఇప్పటివరకు చూసాం. అయితే వైయస్ కు మిక్కిలి సన్నిహితుడిగా సొంత జిల్లా నేతగా ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు.
అయితే జగన్ పార్టీకి చెందిన నేత కాకపోయినప్పటికీ, సొంత జిల్లాలోని ఇతర పార్టీ నేతలను కూడా జగన్ ఆకట్టుకోలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి వైయస్ మరణం తర్వాత ఏర్పడిన పరిణామాల దృష్ట్యా జగన్ పార్టీలోకి సాయి ప్రతాప్ చేరతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే సాయి ప్రతాప్ కు తగినంత ప్రాధాన్యతను ఇవ్వడంలో జగన్ విఫలమయ్యారనే టాక్ స్థానిక నేతల్లో బలంగా వినపడుతోంది.
వైయస్ సమకాలీకుడిగా సాయి ప్రతాప్ కు జిల్లాలో మంచి పట్టు ఉన్న విషయం రాజకీయ విజ్ఞులకు విదితమే. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి 9 సార్లు పోటీ చేసి 6 సార్లు విజయం సాధించిన ట్రాక్ రికార్డ్ సాయి ప్రతాప్ సొంతం. అయినా వైయస్ తో మిక్కిలి సన్నిహితంగా ఉన్న వారిని దూరం చేసుకుంటూ… వైయస్ ను విభేదించిన వారిని దగ్గర చేసుకోవడం… ముందు నుండి జగన్ అవలంభిస్తున్న రాజకీయమే కదా..!