రాజకీయాలకు – కులాలకు ఉన్న అవినాభావ సంబంధం విజ్ఞులకు విదితమే. కులాలను బట్టి రాజకీయ నాయకులు పార్టీలను ఎంపిక చేసుకోవడం రాజకీయాల్లో ప్రధానమే. అలా ఎంపిక చేసుకునే “ఒకసారి పళ్ళు ఊడగొట్టుకున్నాంగా” అంటూ విశ్లేషించారు ఇటీవల టిడిపిలో చేరిన జ్యోతుల నెహ్రూ. కాపు సామాజిక వర్గ నేతగా పవన్ కళ్యాణ్ ‘జనసేన’కు అండగా ఉంటారా అన్న ప్రశ్నకు సమాధానంగా… ఆనాడూ ‘ప్రజారాజ్యం’లో చేరి ‘ఒకసారి పళ్ళు ఊడగొట్టుకున్నాంగా’ అంటూ సమాధానమిచ్చారు.
ఇక పార్టీలు మారుతున్న నాయకులపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన జ్యోతుల… “ఆనాడూ ప్రజారాజ్యంలో ఉన్నపుడు ఇదే పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసాం.., మరి ఇతర పార్టీల నుండి వచ్చిన వారినే కదా వారు టికెట్లు ఇచ్చింది… మరి అప్పుడు చేయని పవన్ కళ్యాణ్, ఇప్పుడు చేస్తాను అంటే ఎలా నమ్మేది, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పవన్ ఎదగలేదు” అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా కీలకం అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తానూ కూడా సమర్దిస్తానని, అయితే వైసీపీని వీడడానికి గల ఒకే కారణం… ప్రతిపక్ష పార్టీగా పరిణితి చెందలేదు, ఏం చెప్పాలనుకున్నా… ఏక నాయకత్వం చుట్టే తిరుగుతుందని, నమస్కారం పెట్టినా… ప్రతినమస్కారం పెట్టని సంస్కారం వైసీపీ అధినేతదని జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు.