Jr NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జతకలవనున్నారు. గత ఏడాది వేసవి కి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ ఏప్రిల్ లేదా మేలో గానీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ జీకే విష్ణుని కెమెరా మాన్ గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.

జికె విష్ణు గతంలో మెర్సల్, బిగిల్, క్రాక్ వంటి సినిమాల కోసం పనిచేశారు. ఇటీవల క్రాక్‌లో ఆయన పనికి చాలా ప్రశంసలు వచ్చాయి.
క్రాక్ లో కొన్ని కొన్ని చోట్ల కెమెరా వర్క్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా ఒంగోలు బస్సు స్టాండ్ ఫైట్ లో. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వార్తకు చాలా ఎక్సైట్ అవుతారు అనడంలో ఎటువంటి అనుమానం లేదు.

ఈ చిత్రాన్ని సంక్రాంతి 2022 కోసం విడుదల చేయాలనేది ప్రణాళిక. ఈ చిత్రాన్ని హరిక హాసిని మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించనున్నారు, ఎస్. రాధాకృష్ణ (చినాబాబు) మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక సక్సెస్ఫుల్ యువ వ్యాపారవేత్తగా కనిపిస్తారని నివేదికలు ఉన్నాయి.

త్రివిక్రమ్ ఎన్టీఆర్ లుక్ ని క్యారెక్టర్ ని చాలా స్టైలిష్ గా ప్లాన్ చేశారట. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఆ చిత్రం ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటిష్ హీరోయిన్ నటిస్తుంది.