Jr -NTR - emotional on the stageఅశేష అభిమానుల సమక్షంలో… భావోద్వేగాల నడుమ “అరవింద సమేత” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసింది. తండ్రి హరికృష్ణ మరణం తర్వాత మొదటిసారిగా అభిమానుల ముందుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. ఒకానొక దశలో తన ఏమోషన్స్ ను నియత్రించుకోలేకపోయారు. ముఖ్యంగా ‘అరవింద సమేత’కు రిలేట్ చేస్తూ తారక్ చెప్పిన డైలాగ్, వీక్షకుల మనసులను కూడా బరువెక్కించింది.

“ఈ సినిమాతో కలిపి ఇప్పటివరకు తాను 28 సినిమాలు చేశాను, అయితే 27 సినిమాలలో ఎప్పుడూ ఏ దర్శకుడు తండ్రి చితికి నిప్పటించే సన్నివేశం పెట్టలేదు, బహుశా డెస్టినీ అంటే ఇదేనేమో… ఈ సినిమాలో మా దర్శకుడు త్రివిక్రమ్ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు, మనం ఒకటనుకుంటే, పైన వాడు మరొకటి రాస్తాడు అంటే ఇదేనేమో” అంటూ బరువెక్కిన గుండెలతో తారక్ తన భావాలను వ్యక్తపరిచాడు.

ఈ ఒక్క సినిమా చూడడానికైనా తన తండ్రి బ్రతికి ఉంటే బాగుండేదని, ‘యుద్ధం ఆపగలిగే వాడే గొప్పోడు’ అన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పామని, నా కెరీర్ లో మైలురాయిలా నిలిచిపోయే సినిమాను త్రివిక్రమ్ అందించారని “అరవింద సమేత” ఘనవిజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు జూనియర్ ఎన్టీఆర్. ఫైనల్ గా… వెళ్తూ వెళ్తూ అందరినీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని, ఈ మాట తన తండ్రికి చెప్పలేకపోయాను, మీకు చెప్తున్నాను, దయచేసి వినండి… అంటూ విన్నవించుకున్నారు.