jio-shocks-airtel‘జియో’ ఎంట్రీతో టెలికాం రంగంలో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు మార్కెట్ లో కుదేలు కావడంతో పాటు, ఇప్పటివరకు ఉన్న డేటా టారిఫ్ లను సవరించుకుని, వినియోగదారులను జియో వైపుకు వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, మరో వైపు ఇంటర్ కనెక్టివిటీ కాల్స్ కలవకుండా జియోను కొంతవరకు నియంత్రించడంలో సక్సెస్ అయిన ‘ఎయిర్ టెల్ అండ్ కో’కు రిలయన్స్ జియో వర్గం మరో షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేసింది.

ఇప్పటివరకు విడివిడిగా ఉన్న అంబానీ సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు వ్యాపార విస్తరణలో భాగంగా వ్యూహాత్మకంగా కలిసిపోయారు. జియోకు టవర్లు ఇవ్వమని ‘ఎయిర్ టెల్ అండ్ కో’ సెల్యూలార్ సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో అవాక్కైన ముఖేష్ అంబానీ చక్రం తిప్పి సోదరుడిని దారికి తెచ్చుకున్నాడు. దీంతో జియో ఆఫర్ ను తలదన్నే ఆఫర్ తో మార్కెట్ ను సొంతం చేసుకుందామని భావించిన ఇతర టెలికాం కంపెనీలకు సవాలు విసిరినట్టయింది.

జియోతో రిలయన్స్ ను వర్చువల్ మెర్జ్ చేస్తున్నట్టు అంబానీ సోదరులు ముంబైలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు మార్కెట్ లో ఉన్న ‘రిలయన్స్’ టవర్స్ ను ‘జియో’ వాడుకోనుంది. ఇందుకు గాను రిలయన్స్ కు భారీ మొత్తం చెల్లించనుంది. 2జి, 3జి, 4జి సర్వీసులకు అవసరమయ్యే స్పెక్ట్రమ్ తమ వద్ద ఉందని అనిల్ అంబానీ స్పష్టం చేయగా, దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా మరింత సమర్థవంతమైన సేవలు వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పటికే రిలయన్స్ లో ఎయిర్ సెల్ ను విలీనం చేసుకోవడం ద్వారా 12 టెలికాం సర్కిల్స్ తో రిలయన్స్ ముందంజలో ఉందని, కంపెనీ పేరిట ఉన్న 75 శాతం అప్పును వచ్చే ఏడాదిలోగా తీర్చేయాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నట్టు అనిల్ అంబానీ ప్రకటించారు. ‘అంబానీ’ సోదరుల ఇరువురి కలయికతో జియో, రిలయన్స్ వ్యాపార లావాదేవీలు కొత్త పుంతలు తొక్కుతాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.