యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంతో కర్ణాటకలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. 15 రోజులలో శాసనసభలో ఆయన బలం నిరూపించుకోవాల్సి ఉండడంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మరిన్ని జాగ్రర్తలు తీసుకుంటున్నాయి. కర్నాటకలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమని భావిస్తున్న ఆ రెండు పార్టీలు వారిని వేరే రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఇందులో భాగంగానే జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లేదా వైజాగ్కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు బీజేపీకి అనుకూలం కాదు కాబట్టి ఆయా రాష్ట్రాలను సెలెక్టు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటిదాకా టీడీపీ గానీ తెరాస గానీ దీనిని ధ్రువీకరించలేదు. ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయని జేడీఎస్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేరళకు తీసుకురావాలని లెఫ్ట్ పార్టీలు ఆహ్వానించాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేడీఎస్ క్యాంప్ నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నారు. ఒకవేళ యడ్యూరప్ప విశ్వాసపరీక్షలో ఓడిపోతే చంద్రబాబుని గానీ కేసీఆర్ ను గానీ మోడీ అంత తేలికగా వదిలే ప్రసక్తి లేదు.