సంచలన వ్యాఖ్యలకు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జేసీ దివాకర్ రెడ్డి, తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలనే చేసారు. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా, అసలు తెలంగాణా విడిపోవడానికి కారణం మాత్రం ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన నేతలే అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ ‘రెడ్డి’లలో జానారెడ్డి నుండి అందరూ ‘రెడ్డి’లు ఉన్నారంటూ పరోక్షంగా వైసీపీ అధినేతను ఉద్దేశిస్తూ అన్నారు. జగన్ లో నాయకత్వ లోపం ఉందని, అది సవరించుకుంటే కనీసం వచ్చే ఎన్నికలలో పోటీని ఇస్తాడని, ఏది ఏమైనా తదుపరి ఎన్నికలలో కూడా విజయం తెలుగుదేశం పార్టీదే అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
జగన్ ఎంతసేపూ ‘మహానేత’ అంటూ చెబుతుంటే సరిపోతుందా? మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడడండి అంటే, కంపుకొడుతుందని ఎద్దేవా చేసారు. ఎంతసేపూ పట్టిసీమ, పోలవరం, ఇతర సమస్యల మీద విమర్శలు కురిపించడమే కాకుండా పరిష్కారం ఏం చేస్తావో చెప్పాలని ఆయన జగన్ ని డిమాండ్ చేశారు. అలా కాకుండా అధికార పక్షం మీద విమర్శలు చేస్తే గెలిచేస్తామని అనుకోవడం భ్రమేనని తేల్చిచెప్పారు. తమ సామాజిక వర్గం జవసత్వాలు ఉడిగిపోయాయని, తమకు సెలైన్ ఎక్కిస్తే సరిపోదని, దేవతలు పానం చేసినది ఉండాలని, అది తన వద్ద లేదని వ్యంగ్యంగా అన్నారు.
గతంలో ఎన్టీఆర్ ఎవరికి టికెట్లిస్తే వారే గెలిచారని, టీడీపీలో ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. తన మాటలు అధికారులు వినడం లేదన్న ఆందోళన లేదని, తనకు అధికారులంతా సరైన గౌరవ మర్యాదలు ఇస్తున్నారని అన్నారు. అనంతపురం ఫ్లైఓవర్ విషయంలో పంతానికి పోవడం లేదని, మీడియా వాళ్లు నారద మునులని, చాలా మంది అలాంటి వారే ఉండడంతో మాటలు మారిపోతున్నాయని చమత్కరించారు. మంత్రి పరిటాల సునీత ఇంత వరకు తనకు వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదని అన్నారు.
అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని, దానిని చెడగొట్టుకోవాలన్న ఆలోచన లేదని, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణల్లో బతికి బట్టకట్టడం కల్ల అని కుండబద్దలు కొట్టారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని, ఒకసారి కోమాలోకి వెళ్తే బతికే అవకాశాలు కష్టమని, కాంగ్రెస్ కూడా అంతేనని ఆయన చెప్పారు. తమ పార్టీకి చంద్రబాబు తల అయితే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కాళ్లు, చేతులని, తనకు సెన్సేషనల్ కామెంట్లు చేయాలన్న కోరిక ఉండదని, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతానని సదరు సంగతులు చెప్పుకొచ్చారు.