JC Diwakar Reddyటీడీపీ గెలుపుపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు అదృష్టవంతుడు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణం. నిన్న క్యూలో అమ్మవార్లు, వృద్ధులు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికి విరగబడి వచ్చారు. అనంతపురం లోక్‌సభలో అందరినీ మార్చమని మార్చకపోతే గెలవం అని చెప్పాను. అయినా మార్చలేదు. మార్చకపోయినా గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే,” అని ఆయన చెప్పుకొచ్చారు.

” నేను మొదట నుండీ కష్టమని అనుకున్న అనంతపురం టౌన్‌, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం. రాసిపెట్టుకోండి.. మే 23వ తేదీన చూడండి. ఇంత వరకూ రాయలసీమలో జరిగింది ఒక లెక్క ఇప్పటి నుండి జరగబోయేది ఇంకో లెక్క’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అదృష్టం.. సుడి తిరిగినట్లు తిరిగిందని జేసీ కొనియాడారు. జేసీ చెప్పిన ఈ జోస్యం టెన్షన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులల్లో ఊపిరి నింపింది.

“సహజంగా క్యూలో ఉండే మహిళలు ఒక్కసారి ఇంటికి వెళ్తే తిరిగిరారు.. కానీ చంద్రబాబు పిలుపుతో ఆయనకు కృతజ్ఞతతోనే మళ్లీ వచ్చి ఓటేశారు. అదృష్టమేగానీ.. నా కృషి లేదా అని చంద్రబాబు అడిగారు, కృషి ఉంటేనే అదృష్టం ఉంటుందని చెప్పా.ఇది ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరపురాని సన్నివేశం. ఇప్పుడున్న వేవ్‌లో 5 వేల ఓట్లతో గెలుపు.. గెలుపే కాదు,” అని ఆయన చెప్పుకొచ్చారు. సహజంగా ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే జేసీ చెప్పారంటే తెలుగుతమ్ముళ్లు విజయం ఖాయమని అంటున్నారు.