JC Diwakar Reddy comments on YS Jagan Mohan Reddy

వ్యంగ్యంగా రాజకీయ విమర్శలు చేసే జేసీ దివాకర్ రెడ్డి మరోమారు తనదైన శైలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చురకలు అంటించారు. “మా అధినేత చంద్రబాబుకు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే వెళ్లి ఒకే ఒక్క కాగితం (నోటీసులు) ఇచ్చాడు. కానీ మా సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి,” అని అన్నారు.

‘మా సీఎం.. మా వాడు’ అంటూ జగన్‌ను సంభోదిస్తూ ఈ వ్యాఖ్యలు చెయ్యడం విశేషం. దొనకొండ లేదా వైజాగ్ రాజధాని చేయాలని చంద్రబాబుకు మేం ఆనాడే చెప్పాం. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని ఆయన చెప్పారని కూడా జేసీ చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నేతలతో సుమారు అరగంటకు పైగా మాట్లాడారు ఆయన.

కాంగ్రెస్ పార్టీలోని ఒకప్పటి సహచరులతో మాట్లాడి బయటికొచ్చాక మీడియాతో మాట్లాడిన జేసీ… “తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ కు కాలంచెల్లింది.నేతలంతా కలిసి పార్టీని చంపేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు,” అని చెప్పుకొచ్చారు.

ఇటీవలే మునిసిపల్ ఎన్నికలలో దేశం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చిన జేసీ సోదరులు తాడిపత్రిలో తమ పట్టు నిలుపుకున్నారు. అన్ని రకాల ఆడ్స్ ను ఎదురుకుని కూడా జేసీ సోదరులు మునిసిపాలిటీలో ఎక్కువ సీట్లు సాధించడం విశేషం.