తెలుగు చిత్రసీమలో సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ భర్త నితిన్ కపూర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన పెళ్లి రోజు (మార్చి 17వ తేదీ)ను పురస్కరించుకుని తన భర్త నితిన్ కపూర్ తో ఉన్న అనుబంధం గురించి జయసుధ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన భర్త ఇప్పుడు దేవతలతో ఉన్నారని, ఎన్నో ఏళ్లుగా తన భర్త వెతికిన శాంతి ఇప్పుడు దొరికిందని కాస్త ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేసారు.
‘డిప్రెషన్’ అనేది తీవ్రంగా పరిగణించాల్సిన మెడికల్ కండిషన్ అని, తన జీవితంలోని ఈ చీకటి కోణాన్ని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు జయసుధ. 32 ఏళ్ల కిత్రం ఇదే రోజున తామిద్దరం ఒకటయ్యామని, తన భర్త సహచర్యంలో తాను గడిపిన మధుర క్షణాలు తనకు గుర్తుకొస్తున్నాయని, తన భర్త ఎక్కడున్నా తమని కాపాడుతూనే ఉంటారని తనకు తెలుసని అన్నారు.
తన భర్తను కోల్పోయిన విషాద సమయంలో తనకు, తన కుటుంబానికి మద్దతు ప్రకటించిన వారికి తన ధన్యవాదాలు తెలిపిన జయసుధ, తన భర్త ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… ఈ సందర్భంగా ఆమె తన భర్తతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. జయసుధ వ్యాఖ్యానించినట్లుగా నితిన్ ఆత్మహత్య ఉదంతంలో మీడియా కాస్త సంయమనంగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ విషయమే.