jayalalithaa_voice“తన ఆరోగ్యం గురించి ఆందోళన చెంది, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు” తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడిన ఓ ఆడియో మెసేజ్ తమిళనాట వాట్సప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, అది నిజంగా అమ్మ గొంతేనా అని కొందరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున గొంతు కాస్త మారి వుండవచ్చని మరికొందరు చెబుతున్నారు.

ఆ ఆడియో సందేశంలో… “దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం మెరుగుపడిందని, విశ్రాంతి అనంతరం, అందరినీ కలుసుకుంటానని, అనారోగ్యానికి కారణం ఏంటో స్వయంగా చెబుతానని, ఎటువంటి వదంతులనూ నమ్మవద్దని కూడా ఉంది. తన పాలనను జీర్ణించుకోలేని విపక్షాలు ఎక్కువగా పని చేస్తూ, తనపై వదంతులు సృష్టిస్తున్నాయని, అయినప్పటికీ ప్రజల ఆశీస్సులు తనకు అండగా ఉన్నాయని” ఆమె చెప్పినట్లు ఉంది. ఈ నెలలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో రెండాకుల గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ, జై అన్నా – జై ఎంజీఆర్ అన్న నినాదంతో మెసేజ్ ముగిసింది.

ఇక జయలలిత సురక్షితంగా ఉన్నారనడానికి ఇదే సాక్ష్యమంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఇదే అధికారిక మెసేజ్ అయితే, మీడియా సమావేశం పెట్టి వినిపించాలే గానీ, ఇలా సోషల్ మీడియాకు ఎందుకు రిలీజ్ చేశారన్నది సమాధానం లేని ప్రశ్న. దీన్ని రికార్డు చేసింది ఎవరు? సోషల్ మీడియాలో పెట్టింది ఎవరు? అన్న ప్రశ్నలకూ సమాధానం లేకపోవడంతో దీన్ని నమ్మేదెలాగని నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.